
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. వరుసగా నాలుగో వారం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత..!!
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగో వారం కూడా సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జారీ చేయాల్సిన గురువారం నాటి సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో దర్శనాల నిర్వహణపై ఒత్తిడి పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు పూర్తిగా నిండిపోయిన పరిస్థితుల్లో, బయట వేచి ఉండే ప్రాంతాల్లో కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో భక్తుల భద్రత, దర్శనాల సక్రమ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో లేకపోవడంతో తిరుమలకు రావాలనుకునే భక్తులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది. టోకెన్ల జారీపై తదుపరి నిర్ణయం భక్తుల రద్దీ పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.