మంగళగిరి, జూలై 22: మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నాటి కలలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచేలా మంగళగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ‘మన ఇల్లు–మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం రెండో రోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని లోకేశ్ తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మంగళగిరిని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. శాశ్వత ఇంటి పట్టాలు అందుకోవడం ద్వారా వేలాది కుటుంబాలకు భద్రమైన భవిష్యత్తుకు బాటలు పడుతున్నాయని ఆయన అన్నారు.
మంగళగిరి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేశ్
